మంత్రికి భార్యే కమీషన్ల ఏజెంటు





ఒక కర్ణాటక మంత్రిగారికి తన భార్యే కమీషన్ ఏజెంటుగా పనిచేస్తోంది. అయ్యగారి దందాలకు పేమెంట్లు ఇంట్లో ఇస్తున్నారో లేదంటే అయ్యగారి పేరు చెప్పి అమ్మగారే దందాలు చేస్తున్నారో తెలియదు.  కానీ పచ్చనోట్ల కట్లలు మాత్రం పెట్టెల్లో నిండిపోతున్నాయి.  చాలాకాలంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఒక టీవీ ఛానల్ తన స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టేసింది. 

విద్యార్థుల హాస్టళ్లకు ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ కేటాయింపులకు సంబంధించిన వ్యవహారంలో కమీషన్ తీసుకుంటూ కర్ణాటక సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఆంజనేయ భార్య విజయ కెమేరాలకు దొరికింది.  ఈ దృశ్యాలు టీవీఛానల్స్ లో  ప్రసారమైన వెంటనే ఆంజనేయపై విపక్షాల దాడి మొదలైంది. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా  చేయాలంటూ విపక్ష బీజేపీ నేతలు  డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అవినీతికి ఆయన భార్య కూడా తోడయ్యారంటూ వారు మండిపడుతున్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లకు బియ్యం - పప్పుధాన్యాలు - నూనె తదితర పదార్థాల సరఫరా కాంట్రాక్టు తమకు ఇప్పించాలంటూ ఒక టీవీ ఛానల్ ప్రతినిధులు మంత్రి ఆంజనేయ భార్య విజయను సంప్రదించారు. ఆమెకు రూ.7 లక్షల నగదును కమీషన్ రూపంలో అందజేశారు. ఇదంతా రహస్య కెమేరాల్లో వారు చిత్రీకరించారు.  గురువారం ఇదంతా టీవీల్లో ప్రసారమవడంతో కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత జరిగినా ఆంజనేయ మాత్రం  ఏమాత్రం తొణకలేదు బెణకలేదు. పైగా తాను దళితుడిని కావడం వల్లే ఇలా అల్లరి చేస్తున్నారంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు.
Previous
Next Post »
0 Komentar